భగవంతుని అవతారములు:

పరమాత్మ నీవు గుర్తుపడితే ఇరవైరెండు రూపములు ప్రధానమయినవిగా వచ్చాడు. ఆ ఇరవైరెండు రూపములు గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థం అయిపోతుంది.” అన్నాడు సూతుడు. అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని శౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు.

అపుడు ఆయన అన్నారు – ’క్షీరసాగరమునందు శయనించి లోకుల అన్ని విషయములను యోగనిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖచక్రగదాధరుడై నాభికమలమునుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా, ’కదిలిన బాహుపదంబుల కంకణ రవముసూప’ అంటారు పోతనగారు – ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంకణములు ధ్వనిచేస్తుంటే, ఆయన పాదమును లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురముల ధ్వని కలుగుతుంటే, పచ్చని పీతాంబరము కట్టుకొన్నవాడై, తెల్లటి శంఖమును చేతిలోపట్టుకొని, కుడిచేతిలో చక్రం పట్టుకొని, గద పట్టుకొని, పద్మం పట్టుకొని, శేషుని మీద పడుకున్న ఆ శ్రీమహావిష్ణువు వున్నాడే శ్రీమన్నారాయణుడు – ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమయిన స్వామి. అటువంటి స్వామి, ఆ నారాయణ తత్త్వము, ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. ప్రతివాడి మాంసనేత్రమునకు కనపడడు. అది ఎవరో యోగులు – జీవితములలో మాకు సుఖములు అక్కర్లేదని తలచివవారైమ్ ఇంద్రియములను గెలిచినవారై తపస్సుచేసి కొన్నివేల జన్మలు భగవంతునికోసం పరితపించిపోయిన మహాపురుషులు, ఎక్కడో ధ్యానసమాధిలో ఈశ్వరదర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్త్వం. అది ఉన్నది. దానిలోంచి మిగిలినవి అన్నీ వచ్చాయి. అది అవతారము కాదు. అది ఉన్న పదార్థము. అది మైనము. ఇపుడు ముద్దకట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలయినా చేయవచ్చు.

అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఈ సృష్టి జరగడానికి నారాయణుని నాభికమలంలోంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు. నాలుగు ముఖములతో వేదం చెపుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టిచేసిన వాడెవడో అది మొట్టమొదటి అవతారం. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు.

ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తరువాత వచ్చిన అవతారం ఈ భూమినంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షుని వధించడానికి వచ్చిన యజ్ఞ వరాహమూర్తి రెండవ అవతారము.

మూడవ అవతారము – సంసారమునందు బద్ధులై, కర్మాచరణం ఎలా చెయ్యాలో తెలియక కామమునకు, అర్థమునకు వశులైపోయిన లోకులను ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకివచ్చిన మహానుభావుడైన నారదుడు.

బ్రహ్మగారితోపాటు వచ్చినవారు సనకసనందనాదులు. నారదుని అవతారం తరువాత వచ్చినది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషంగా వేదాంతతత్త్వమునంతటిని చెప్పాడు. కపిలుని అవతారము తరువాత వచ్చిన అవతారము దత్తావతారము. దత్తాత్రేయుడై అనసూయ అత్రి – వారిద్దరికి జన్మించి మహాపురుషుడై, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన బ్రహ్మవిష్ణు మహేశ్వరుల తత్త్వముతో కూడినవాడై జ్ఞాన ప్రబోధంచేసి ప్రహ్లాదాదులను ఉద్ధరించిన అవతారము ఏది ఉన్నదో అది దత్తాత్రేయస్వామి వారి అవతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత వచ్చిన అవతారము యజ్ఞావతారము. యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు.

ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికి ఋషభుడు అనే పేరుతో మేరుదేవి, నాభి అనబడే ఇద్దరి వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు.

తరువాత ఈ భూమండలమును ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరు ప్రార్థనచేస్తే పృథుచక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి పృథుచక్రవర్తి ఓషధులను పిండాడు.

తరువాత వచ్చినది మత్స్యావతారము. మత్స్యావతారములో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలములో వైవస్వతమనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది. సముద్రములన్నీ పొంగిపోయి కలిసి పోయాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఇక ఉండడానికి ఎక్కడా భూమిలేదు. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారయి పెద్దచేపగా మారి తనకు ఉండే ఆ మూపుకి ఈ పృథివిని పడవగా కట్టుకుని అందులో సత్యవ్రతుణ్ణి కుర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవను లాగి, ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడిన అవతారము మత్స్యావతారము.

తదనంతరము క్షీరసాగరమథనం జరిగింది. అందులో లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీకళ్యాణం జరుగుతుంది. లక్ష్మీకళ్యాణఘట్టమును ఎవరు వింటారో వాళ్ళకి కొన్నికోట్ల జన్మలనుండి చేసిన పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆరోజుతో అంతమయిపోతుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగరమథన సమయంలో మందరపర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం ఎత్తాడు.కూర్మావతారం వచ్చిన తరువాత వచ్చిన అవతారం మోహినీ అవతారం దేవతలకు, దానవులకు మోహినీ స్వరూపంతో అమృతమును పంచిపెట్టాడు. మోహినీ అవతారము తరువాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారము. ఈ అవతారములో స్వామి హిరణ్యకశిపుడిని వధించాడు.

నరసింహావతారము తరువాత వచ్చిన అవతారము వామనావతారము. ఇప్పుడు చెప్పుకుంటున్న అవతారక్రమము మనువుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగా పెట్టకపోయినా, తద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణం అయిపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్పకథ వామనమూర్తి కథ.

వామనావతారము తరువాత వచ్చిన అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని ఇరువతి ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడు. పరశురామావతారము తరువాత వచ్చిన అవతారము వ్యాసావతారము.

కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేదవిభాగం చేసి ఉదారముగా పదునెనిమిది పురాణములను వెలయించిన మహానుభావుడుగా వ్యాసుడై వచ్చాడు.

వ్యాసావతారము తరువాత వచ్చిన అవతారము రామావతారము. రామావతారములో సముద్రమునకు సేతువుకట్టి దశకంఠుడయిన రావణాసురుణ్ణి మర్దించి ధర్మసంస్థాపన చేసి లోకులు ధర్మముతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము.

రామావతారము తరువాత వచ్చిన అవతారము బలరామావతారము.

బలరామావతారము తరువాత వచ్చిన అవతారము కృష్ణావతారము.

కృష్ణావతారము తరువాత వచ్చిన అవతారము బుద్ధావతారము. దశావతారములలో బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకటదేశము అనబడు మగధ సామ్రాజ్యమునందు దేవతలపట్ల విరోధభావనతో వున్న రాక్షసులను మోహింపచేయడానికి వచ్చిన అవతారము. మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారము గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు.

బుద్ధావతారము తరువాత వచ్చే అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్కిఅవతారము. కల్కిఅవతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కలియుగం ప్రథమపాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతం అయిపోయేముందు యుగసంధిలో కాశ్మీరదేశంలో ఉన్న విష్ణుయశుడు అని పిలవబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. ఆయన అవతారం రాగానే సవికల్పసమాధిలో ఉన్న యోగులందరూ పైకిలేస్తారు. అపుడు ఖడ్గమును చేతపట్టుకొని తెల్లటి గుర్రంమీద కూర్చుని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులనందరిని సంహరిస్తారు. యుగాంతం అయిపోతుంది. మరల క్రొత్త యుగం ప్రారంభమవుతుంది. కల్కి అవతరం యుగసంధిలో వస్తుంది.

ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారు. దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారు? కృష్ణావతార ప్రారంభమునందు భాగవతమును రచిస్తున్న సమయంలో భూతభవిష్యద్వర్తమాన కాలజ్ఞానము ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయములను చెప్పగలుగుతున్నాడు. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుని అంశ. మహానుభావుడు. ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే అవతారములు ఈ ఇరవై రెండేనని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే! కొన్ని ప్రధానమయిన విషయములు మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి.

’అజాయమానో బహుధావిజాయతే” ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలయిన రూపమును పొందాడు. దేనికోసం? ఆయనే చెప్పారు.

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!!