తరువాత కురుక్షేత్ర సంగ్రామం అయిపొయింది. ధృతరాష్ట్రుని పక్షం అంతా ఓడిపోయింది. పాండవపక్షం గెలిచేసింది. అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదనే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగింది. ‘దాహం వేస్తోంది’ అన్నాడు. నీళ్ళు పట్టుకు వచ్చారు. అంపశయ్య మీద పడుకున్న వాడు లౌకికమయిన జలములు త్రాగడు. ఏ నీళ్ళు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. ‘అర్జునా, మంచినీళ్ళు ఇయ్యి’ అన్నాడు. అపుడు అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోనుండి అమృతోదకం పైకిలేచి భీష్ముని నోటిలో పడింది. ఆ నీటిని త్రాగాడు. త్రాగి అంపశయ్య మీద పడి ఉన్నాడు. భీష్ముడు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో ‘భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు. నీవు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరల ధర్మం చెప్పేవాడు లేదు’ అని చెప్పాడు. అయితే భీష్ముడు చెప్పిన ధర్మములు భారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే ఉత్తర గర్భం మీదికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భమును కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు. ఉపపాండవులు అశ్వత్థామ చేత సంహరింపబడ్డారు అనేమాటను విన్నాడు. విని భీష్ముడు కాలమును ముందు స్తుతి చేస్తాడు.

పదినెలలూ పూర్తీ అయిన పిమ్మట ఉత్తర గర్భమునుండి పరీక్షిన్మహారాజు ఉదయించాడు. అసలు యధార్తమునకు అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆవంశము ఆక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. కానీ ధర్మరాజు అంతటి వాడు తనకు వంశంలేదు అని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా, తనను తానూ రక్షించుకోవడం చేతకాని వాణ్ణి, గర్భాస్తమయిన పిండమును రక్షించాడు కృష్ణుడు. కృష్ణ భగవానుని అనుగ్రహము చేత బ్రతికింప బడి బయటకు వచ్చిన పిల్లవాడు కనుక అతనికి ‘విష్ణురాతుడు’ అని పేరు పెట్టారు.

పరీక్షిత్తు పుట్టిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజుగారు సభాతీర్చి ఉన్నారు. లేకలేక కలిగిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడమీద కూర్చోబెట్టుకుని, సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతీవాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడంటే ‘మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రము అనే అస్త్రం వచ్చి అగ్నిహోత్రమును వేదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ స్తోత్రం చేస్తే, ఎవరో ఒక అంగుష్ఠ మాత్రమయిన మూర్తి శంఖ చక్ర గదా పద్మములతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెదతాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడయినా కనపడతాడా’ అని సభలో చూసేవాడు. విష్ణురాతుడు అని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని ‘పరీక్షిత్’ అని పిలిచారు. అందుకని ‘పరీక్షిత్’ అయ్యాడు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు ఆ పిల్లవాని జాతకం చూసి ‘యితడు ఆమచంద్రమూర్తి వంశమునకు మొదటివాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానములు చేశాడో అటువంటి దానములు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువులను, బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణములను విడిచి పెడతాడో అలా బాణములను విడిచి పెడతాడు. కార్తవీర్యార్జునుడు వేయి చేతులతో ధనుస్సును పట్టుకుని బాణములను వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్టచివర శరీరం విడిచి పెట్టవలసిన సమయం ఆసన్నమయిన నాడు ఆవు పాలు పితికినంత సేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని, ఈ పిల్లవాడి ఆర్తిచూసి కృష్ణ భగవానుని పాదములయందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరమును విడిచిపెట్టి, మోక్షమును పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమయిన వ్యక్తి మీ వంశంలో పుట్టాడు’ అని చెప్పారు.

ధర్మరాజు గారు పొంగిపోయారు. అప్పుడు అనుకున్నాడు. ‘నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను కొన్ని కోట్లమందిని తెగటార్చాను. ఎందఱో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చేయాలి. అశ్వమేధయాగమునకు కావలసినటువంటి సంభారములు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి?’ అని భీమార్జునులను పిలిచి అడిగాడు. అపుడు భీమార్జునులు ‘అన్నయ్యా, దానిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఎందుచేత అంటే ఇతః పూర్వం ఉత్తర భారతదేశంలో మరుత్తు అనే రాజు అశ్వమేధ యాగం చేసి తత్సంబంధమయిన కాంచన పాత్రలు మొదలయిన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనాధికారం ఉన్నది కనుక, ఆ ప్రాంతం మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది కనుక ఆ సంపదను సంభారములను మేము తీసుకువస్తాము. నీవు అశ్వమేధ యాగము చేయవలసింది’ అన్నారు.

ధర్మరాజు గారు మూడు అశ్వమేధ యాగములు చేశారు.ఆ యాగములకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించారు. ఆయనను సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. తరువాత కృష్ణ పరమాత్మ ద్వారకా నగరమునకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్నవాళ్ళందరూ ఆయనను ఎంతో స్తోత్రం చేశారు. అక్కడ ద్వారకా నగరంలోని ప్రజలు స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు.

అక్కడ హస్తినాపురంలో అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు.

విదురుని ఆగమనము

ఒకరోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి తీసుకొని వచ్చాడు. తరువాత విదురుడు చక్కటి భోజనం చేశాడు. తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అయ్యా మహానుభావా, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మీరు మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రిగారు మరణిస్తే, ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల క్రింద పెట్టుకుని కాపాడి తానూ తీసుకువచ్చి ఆహారమును నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్డామనుకున్నప్పుడు, అనేకమయిన ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు కోరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఈ తీర్థములకు వేల్లాతో, ఏమేమి చూశారో మాకు చెప్పవలసింది’ అని అడిగాడు.

తీర్థయాత్ర చేసివచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తే ఇవతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతమును కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన ఫలితం వట్టినే పోదు.

ధృతరాష్ట్రుని వానప్రస్థము

తరువాత ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో ‘నామాట విని ఉత్తర క్షణంలో లేచి ఉత్తర దిక్కుకి వెళ్ళిపో. ఎవరికోసం చూడకు. ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట జీవితం నీకు చాలు. ఇప్పటికయినా నామాట విను. వెళ్ళిపోయి ఈశ్వరునియందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగమార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది’ అన్నాడు.

ధృతరాష్ట్రుడు ‘గొప్పమాట చెప్పావయ్యా! నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? భీముడు మొదలయిన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటి కూడు తిని ఇంకా సంతోషంగా బ్రతికేస్తున్నానా? ఛీ నాకు రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.

అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఉదయం ధర్మరాజుగారు స్నానానుష్ఠానము లన్నీ పూర్తి చేసుకున్న తరువాత వచ్చి పెదతండ్రిగారయిన ధృతరాష్ట్రుడికి, గాంధారికీ తల తాటించి నమస్కరించేవాడు. ఆరోజుకూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురమునకు వచ్చాడు. ఆయన కనపడలేదు. ‘నావల్ల ఏదో అపకారం జరిగి వుంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలు అందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖ పడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో! నాకు చాలా బెంగగా ఉంది. గాంధారీమాత కూడా కనపడడం లేదు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు’ అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు.