స్వామి ఈ లేఖను చదివి, దానిని పక్కనపెట్టి అగ్నిద్యోతనునీతో ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు. ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అపుడు అగ్నిద్యోతనుడు అన్నాడు “ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు. గురువు ఈశ్వరదర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ యిద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు. ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు.

‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?” అని బలరాముడు అడిగాడు. ‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు.

కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడురా మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!

ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.

ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?

విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం

డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యా మహా దేవియున్

నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?

‘అగినిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో యిలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’ అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు

“తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం

దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం

దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై

మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్.”

‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గోప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులయితే ఎంత బాగుంటుందో! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని యిచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది.

అమ్మవారు అన్న మాటలో ‘ఆర్యామహాదేవి’ అనే ఒక గమ్మత్తయిన మాట వుంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.

బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే

ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌ

త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిః

పూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః!!

శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతొ పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.

ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా! కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువు నయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగల్గుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కతాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది

నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయు మమ్మ! ని

న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”

సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు యిద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని అయిదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ యీశ్వరీ, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అంది. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది.

రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందఱో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల

గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘ సంకాశదే

హు, నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,

ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్!!

రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది.

ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది. కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడు

బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన. బ్రతుకు కలిగెనేని భార్య కలదు

బ్రతికితీవు; భార్యపట్టు దైవమెరుంగు, వగవ వలదు చైద్య! వలదు వలదు!!

శిశిపాలా, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి

మా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ? వేది వంశ?

మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి? వెయ్యది నడవడి? యెవ్వడెరుగు?

మానహీనుడ వీవు? మర్యాద లెరుగవు; మాయ గైకొని కానీ మలయ రావు;

నిజరూపమున శత్రు నివహంబుపై బోవు; వసుధేశుడవు గావు వావి లేదు;

కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు, విడువు; విడువవేని విలయకాల

శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల గర్వమెల్ల గొందు గలహమందు!!

రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు నిలు కృష్ణా, నిన్ను యిప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు.

కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నిండా చేస్తున్నాడు. కానీ అది స్తుతిపాఠం అయిపొయింది. నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్ట్టుకొని సంకల్పం చేస్తున్నారు.

అని డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతో

వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁ

గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ

క్కిన రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు రోచిష్ణుఁడై.

అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తనతోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని యింకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది, భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకుంది. అపుడు కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు.

తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.

ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై

భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం

ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్

సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.

ఆరోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది, అయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.

అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడ గ్రీడ సలుపుచున్న కృష్ణు జూచి

పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి, ప్రీతి లగుచు ముక్త భీతు లగుచు!!

ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.